గురువాయూరప్పను దర్శించుకున్న పవన్

• వేకువజామున పవిత్ర నిర్మాల్య సేవ
• తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు

కేరళం రాష్ట్రం, త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు. ముందురోజు చేసిన అలంకరణతో స్వామిని చేసుకునే తొలి దర్శనాన్ని నిర్మాల్య సేవగా పిలుస్తారు. ఈ సేవ కోసం శనివారం ఉదయం వేకువజామున 3 గంటలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువాయూర్ ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ విశిష్ట సేవలో పాల్గొని తరించారు. అంతకు ముందు గురువాయూర్ చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. దక్షిణ ముఖద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించిన ఆయన, స్వామి నిర్మాల్య దర్శనం చేసుకున్నారు. గర్భాలయంలో మూలవిరాట్టుకి నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలు అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించారు.

స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ

నిర్మాల్య దర్శనానంతరం సంప్రదాయం ప్రకారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు. శంభాభిషేకం, వాకచార్థు సేవలు నిర్వహిస్తారు. స్వామి వారికి ముందు రోజు అలంకరించిన గంధాన్ని తొలగించి అభ్యంగన స్నానం చేయించే అద్భుత సేవ గురించి ఆలయ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నైరుతిలో ఉన్న వినాయకుడిని దర్శించుకుని, ఆలయ ఆచారాలను అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగం చేశారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయ ప్రదక్షణలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గురువాయూర్ మేల్ శాంతితోపాటు ఇతర ప్రధాన అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి, స్వామివారి కళభం, తదితర ప్రసాదాలు అందజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆయుర్వేద థెరపీ చేసిన వైద్యులు ఆయనతోపాటు గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top